
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :-
అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వేతనాలను పెంచాలని, గ్రాట్యుటీకి నిబంధనలు రూపొందించి అమలు చేయాలని, అంగన్వాడి హెల్పర్ల ప్రమోషన్ల కొరకు ఇచ్చిన జీవో నెం.5 ను రద్దు చేయాలని ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించామని, ఈ ఆందోళన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై నిర్బంధం ప్రయోగించడం, అంగన్వాడీలకు ఇచ్చే వేతనాలలో కార్యకర్తలకు 11,500 గాను 9875 ను, హెల్పర్లకు ₹7,000 గాను 6,250 మాత్రమే ఇచ్చి, మిగతావి కోత విధించిందని పేర్కొన్నారు.మార్చి 2మాత్రమే సెలవు పెట్టి విజయవాడలో జరిగే ఆందోళనలో పాల్గొన్నారని, మిగతా రోజులలో డ్యూటీ చేస్తూ, ఆందోళనలను చేసామని తెలిపారు. డ్యూటీ చేసిన రోజులలో కూడా వేతనాలలో కోత విధించడం సరైనది కాదని ప్రభుత్వాన్ని, ఐసిడిఎస్ ఉన్నతాధికారులను హెచ్చరించారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే, ఆసమ్మె శిబిరాల వద్దకు వచ్చి మీకు న్యాయం చేస్తాం, మీ వేతనాలు పెంచుతామని చెప్పిన తెలుగుదేశం నాయకుల హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో 42 రోజులు సమ్మె చేస్తే, సమ్మె కాలానికి వేతనాలైనా చెల్లించారని, ఈ ప్రభుత్వ హయాంలో ఆందోళన చేస్తుంటే ఆందోళనలకు వెళ్లకుండా అంగన్వాడీలను అడ్డగించడం, దమనకాండ చేయటం, వేతనాలలో కోత విధించడం వంటి పద్ధతులతో అంగన్వాడీలను బెదిరించాలని అనుకోవటం అవివేకమని పేర్కొన్నారు. కోత విధించిన వేతనాలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనకు వెనకాడబోమని హెచ్చరించారు. ఈనెల 15న ఒంగోలులో జరిగే జిల్లా మహాసభకు జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు తరలిరావాలని కోరారు. 14న శ్రామిక మహిళ జిల్లా సదస్సుకు జిల్లాలోని శ్రామిక మహిళలందరూ హాజరుకావాలని కోరారు. ఈనెల 17,18,19 తేదీలలో నంద్యాలలో జరిగే సిఐటియు 17వ రాష్ట్ర మహాసభల్లో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించి, ఉద్యమాల రూపకల్పన చేస్తామని,ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సిఐటియు ఉలవపాడు మండల కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం ఉలవపాడు అంబేద్కర్ నగర్ లో సి.హెచ్.ఇందిరావతి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ పాల్గొని మాట్లాడారు. సమావేశంలో సీఐటీయూ ఆర్ వీ. ఎస్. ఎన్ సత్యనారాయణ,అంగన్వాడి, ఆశా రంగాల నుండి నాళం శ్రీదేవి, ఎస్ గీత, జె ప్రవీణ, కె తిరుపతమ్మ,ఎ మార్తమ్మ, కే సుగుణ కుమారి, ఎం జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉలవపాడు పంచాయతీ పరిధిలోని పంచాయతీ కార్మికులు సిఐటియుసంఘంలో సభ్యులుగా చేరారు