
తొలి శుభోదయం న్యూస్ కావలి:-
రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్, తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపల వేట కొనసాగించడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతోందని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పీ. సింగ్ బఘేల్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సమస్య వల్ల స్థానిక మత్స్యకారుల వలలు దెబ్బతినడం,చేపల నిల్వలు తగ్గిపోవడం,జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు.అంతర్రాష్ట్ర స్థాయిలో సమన్వయం లోపించడం వల్ల వివాదాలు పునరావృతమవుతున్నాయని కూడా వివరించారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులతో తక్షణ త్రిపాక్షిక సమావేశం నిర్వహించడం,దక్షిణ ప్రాంతీయ ఫిషరీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ను బలోపేతం చేయడం,తీర ప్రాంత గస్తీ చర్యలను పెంచడం,పులికాట్ సరస్సు ఇరువైపుల డ్రెడ్జింగ్ చేపట్టడం వంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఈ చర్యలు చేపడితే చట్టవ్యవస్థ పరిరక్షణతో పాటు వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధి కాపాడబడుతుందని బీద మస్తాన్ రావు యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.అందుకు మంత్రివర్యులు స్పందిస్తూ వెంటనే తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.