
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడం, ట్రాఫిక్ నిబంధనల అమలు లక్ష్యంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 45 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫాం ధరించాల్సిన అవసరం, ట్రాఫిక్ నియమాలు, ప్రయాణికుల భద్రత అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఆటో డ్రైవర్లపై చట్ట ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు, భవిష్యత్తులో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించడం వల్ల గుర్తింపు స్పష్టంగా ఉండటంతో పాటు, ప్రయాణికుల్లో భద్రతా భావన పెరుగుతుందని పోలీసులు తెలిపారు. అలాగే వేగ నియంత్రణ, లైసెన్స్, వాహన పత్రాలు, ఓవర్లోడింగ్ నివారణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని సూచించారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఇటువంటి కౌన్సెలింగ్ కార్యక్రమాలు, ట్రాఫిక్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ప్రకాశం జిల్లా ప్రజల భద్రత, రోడ్డు క్రమశిక్షణ పరిరక్షణ కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ఆటో డ్రైవర్లు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.