
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, ప్రజల ఆర్థిక భద్రతను కాపాడటం, ఏటీఎం లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఏటీఎంల వద్ద ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా ఏటీఎంల పరిసర ప్రాంతాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల పని తీరును పోలీసులు సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఏటీఎంల వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు. ఏటీఎంలలో లేదా పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నిర్లక్ష్యం లేకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా తనిఖీ చేసి, లోపాలు ఉన్న చోట వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.ఏటీఎం కార్డు మార్పిడి మోసాలు, స్కిమ్మింగ్, నగదు చోరీలు వంటి ఆర్థిక నేరాలను అరికట్టడంలో ఈ తనిఖీలు కీలకంగా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, పిన్ నంబర్ గోప్యంగా ఉంచాలని, అపరిచితుల సహాయం తీసుకోకూడదని సూచించారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే డయల్ 112 / 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.నేర నివారణ, ప్రజల ఆర్థిక భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లాలో ఇలాంటి భద్రతా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.