
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఒంగోలు నగరంలో ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ట్రాఫిక్ సీఐ గారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి అని సూచించారు. ప్రతి ఆటోపై పోలీస్ నమోదు నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఉండాలని, ఇది ప్రయాణికుల భద్రతకు ఎంతో కీలకమని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అవగాహన కల్పించారు.ప్రత్యేకంగా ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, అదనపు చార్జీలు వసూలు చేయకుండా న్యాయమైన విధంగా సేవలు అందించాలని డ్రైవర్లకు సూచించారు. ప్రజల విశ్వాసాన్ని పొందడం ఆటో డ్రైవర్ల బాధ్యత అని, సేవా భావంతో పనిచేస్తే వారి వృత్తికి గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ, నగరంలో క్రమబద్ధమైన రవాణా వ్యవస్థను నెలకొల్పేందుకు సహకరిస్తామని తెలిపారు.