
తొలి శుభోదయం ఉలవపాడు :-
కరేడులో ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, స్థానిక రైతులు, భూసేకరణ పేరుతో కరేడు రామకృష్ణాపురం, ఉప్పరపాలెం గ్రామాలను ఖాళీ చేయించే ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ గిరిజనులు,దళితులకు అండగా గత ఏడు నెలలుగా సాగుతున్న ఉద్యమానికి సిపిఎం నేతలు ప్రత్యక్షంగా పాల్గొని అండగా నిలిచామని, ఈనెల 12న చెన్నైలో జరిగే గ్రీన్ ట్రిభ్యునల్ జడ్జి చేపట్టే విచారణలో సిపిఎం నేతల పాల్గొని, కరేడు గ్రామంలో జరిగే నష్టాన్ని తెలియజేయాలని సిపిఎం నిర్ణయించినట్లు ఆ పార్టీ ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శిజీవీబీ కుమార్ తెలిపారు.
ఈరోజు కందుకూరు సుందరయ్య భవన్ లో సిపిఎం ఉలవపాడు, వలేటివారిపాలెం ప్రాంతీయ కమిటీ సమావేశం ఎస్.డి. గౌస్ బాషా అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో జరిగిన నిర్ణయాలను సిపిఎం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్ పత్రికలకు తెలిపారు.కరేడు రైతులకు మద్దతుగా జరిగే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్ణయించారని తెలిపారు. జనవరి 14 నుండి 16 వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా కరేడు రామకృష్ణాపురంలో, ఉలవపాడు అంబేద్కర్ నగర్ లో,వలేటివారిపాలెం మండల కేంద్రంలో యువతీ యువకులకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 18 నుండి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి నిర్వీర్యం చేయొద్దని, కూలీలకు పని హక్కును రద్దుచేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఉలవపాడు, వలేటివారిపాలెం మండలాల లోని అన్ని గ్రామాలలోని కూలిపేటలలో ప్రచారం చేస్తామని తెలిపారు.సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం ప్రాంతీయ కమిటీ నాయకులు దువ్వూరి జాన్, కత్తి సుజాత, ఏలూరి నాగార్జున, సిహెచ్ ఇందిరావతి, కే భారతి తదితరులు పాల్గొన్నారు.