
తొలి శుభోదయం గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని షాది ఖానాలో ఆదివారం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఈగల్ (ఐ) చైర్మన్ డాక్టర్ రఫీ ఆధ్వర్యంలో నంద్యాల విష్ణ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ వైద్య శిబిరానికి గిద్దలూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 500 మందికి పైగా ప్రజలు శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. అనుభవజ్ఞులైన వైద్యులచే బీపీ, షుగర్, ఈసీజీ, ఎముకల సాంద్రత (బోన్ డెన్సిటీ), పీఎఫ్టీ, కంటి పరీక్షలు సమగ్రంగా నిర్వహించారు. వ్యాధులు గుర్తించిన వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఖర్చులతో ఇబ్బంది పడుతున్న పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని స్థానికులు నిర్వాహకులను కోరారు.ఈ సందర్భంగా డాక్టరు.రఫీ మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్.వికాస్ ఆర్థోపెడిక్ , కృష్ణ శాంతి MS opthal, వెంకట మనోహర్, పల్మోనోలజిస్ట్ ,ఖదీర్ భాషా, అక్బర్ వలి పాల్గొని శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు విశేషంగా సహకరించారు.