
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, గ్రామ పరిస్థితులు, స్థానిక అంశాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు సైబర్ నేరాల పెరుగుతున్న ప్రమాదాలు, ఆన్లైన్ భద్రత, వ్యక్తిగత సమాచార రక్షణ, రోడ్డు భద్రతా నియమాల ప్రాధాన్యత, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో గ్రామ ప్రజలకు వివరించారు.గ్రామస్తుల నుంచి వచ్చిన సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని, ఎటువంటి అసాంఘిక లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఇటీవలి కాలంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం పెరుగుతోందని పేర్కొంటూ, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే సైబర్ నేరాల బారినపడిన పౌరులు వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.ప్రజలతో నేరుగా అనుసంధానమవుతూ, విశ్వాసాన్ని పెంచే దిశగా ప్రకాశం జిల్లా పోలీసులు ముందడుగు వేస్తున్నారు.