
కలెక్టర్ ను రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం ఉదయం మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో నూతనంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీమతి ఎం. విజయ సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన జిల్లాగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్కు ఎమ్మెల్యే ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలు మరియు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై చర్చించారు. ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన కలెక్టర్, నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాచర్ల మండలం, జేపీ చెరువు పంచాయతీ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ను ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలలో ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయని వివరించారు.
నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు వివిధ జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోరారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ మరియు రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్కు విన్నవించారు.