
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ప్రకాశం జిల్లా టంగుటూరు దరఖాస్తుదారులకు కీలక సమాచారం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలలో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. అన్నమ్మ తెలిపారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు లోని బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలలో (బాలురు) 5వ తరగతిలో ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ ప్రవేశ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారని, ప్రవేశాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటాయని తెలిపారు. అర్హతల వివరాలు, పరీక్ష విధానం, సిలబస్ తదితర సమాచారం అధికారిక వెబ్సైట్ https://mjpabcwreis.apcfss.in/� లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే మరిన్ని వివరాలకు 9705432252 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో మొత్తం పలు గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు. అందులో 4 బాలుర గురుకుల పాఠశాలలు ఉండగా, విద్యార్థులకు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాం వంటి అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించబడతాయని వెల్లడించారు. ఇటీవలి సంవత్సరాల్లో ఈ గురుకుల పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. కాబట్టి అర్హులైన బీసీ వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. అన్నమ్మ విజ్ఞప్తి చేశారు.