
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీసు:-
ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం పోలీస్ యంత్రాంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాల నియంత్రణలో మరో ముందడుగు వేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు, ‘MSCD’ (Mobile Software Components Device) పరికరాల ద్వారా అనుమానితుల వేలిముద్రలను సేకరించి, వెంటనే డిజిటల్ డేటాబేస్తో సరిపోల్చి విశ్లేషిస్తున్నారు.రద్దీగా ఉండే ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, పాత నేరస్తుల వివరాలతో పోల్చడం ద్వారా నేర చరిత్ర కలిగిన వ్యక్తులను తక్షణమే గుర్తిస్తున్నారు. ఈ ఆధునిక విధానం ద్వారా నేరాల నివారణలో వేగం పెరగడమే కాకుండా, దర్యాప్తులో ఖచ్చితత్వం కూడా మెరుగుపడుతోంది.పోలీసులు చేపడుతున్న ఈ ‘స్మార్ట్ పోలీసింగ్’ చర్యలతో ప్రజల భద్రత మరింత బలోపేతం అవుతుందని, నేరాలకు అడ్డుకట్ట వేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.