
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం మండలంలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గురువారం ఎస్సై వేమన ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారులు, పట్టణ పరిధిలో కీలక కూడళ్ల వద్ద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాహనదారులను తనిఖీ చేశారు.
ఈ తనిఖీలలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, రెండో తరగతి న్యాయ మేజిస్ట్రేట్ డి. శాంత కుమారి విచారణ జరిపి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.
ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.