
రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల నాయకుల డిమాండ్
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి తౌసిక్ అనుమానాస్పద మరణంపై సమగ్ర న్యాయ విచారణ జరిపి పూర్తి నిజాలను ప్రజలకు వెల్లడించాలని, ఈ ఘటనపై కలెక్టర్ నియమించిన త్రీ మెన్ కమిటీ నివేదికను వెంటనే బయటపెట్టాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఫిబ్రవరి 25న సింగరాయకొండ ప్రజాసంఘాల కార్యాలయంలో తౌసిక్ కుటుంబానికి అండగా నిలుద్దాం అనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజేష్ అధ్యక్షత వహించారు.సమావేశంలో మాట్లాడిన నాయకులు తౌసిక్ మరణం ఒక్క కుటుంబానికి చెందిన విషాదం మాత్రమే కాకుండా విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న అక్రమాలు, నిర్లక్ష్యం మరియు పర్యవేక్షణ లోపాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఘటన జరిగినప్పటి నుండి విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం మరియు నివేదిక విడుదలలో జాప్యం చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు.ప్రజాసంఘాల నాయకులు త్రీ మెన్ కమిటీ విచారణలో క్రింది అంశాలను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు.మరణించిన విద్యార్థి తౌసిక్ గత రెండు సంవత్సరాలుగా సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్నప్పటికీ, అధికారికంగా కనిగిరిలోని ప్రగతి పాఠశాలలో పేరు నమోదు చేసి హాజరు కూడా అక్కడే చూపిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇది విద్యా నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఈ అక్రమ విధానంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికలో నమోదు చేయాలని కోరారు.అలాగే నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశాల పేరుతో ఒక పాఠశాల ప్రాంగణంలో కోచింగ్ సెంటర్ నిర్వహించేందుకు సంబంధిత శాఖల నుండి అనుమతులు పొందినట్లున్నాయా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.ట్రేడ్ లైసెన్స్ పొందకుండా హాస్టల్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇది ట్రేడ్ చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన ప్రాథమిక నిబంధనలు పాటించకుండా హాస్టల్ నిర్వహించడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు.శ్రీ చైతన్య పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ వారి పేర్లు వివిధ ప్రాంతాల పాఠశాలల్లో నమోదు చేసినట్లు సమాచారం ఉందని, నవోదయ సీట్ల సాధన కోసం అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సింగరాయకొండ ముస్లిం సంఘం నాయకులు ఎస్కే సుల్తాన్ మాట్లాడుతూ తౌసిక్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజాసంఘాలు పోరాటం కొనసాగిస్తాయని తెలిపారు. పేద మరియు మైనారిటీ కుటుంబాల పిల్లల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.తౌసిక్ మరణానికి కారణమైన వాస్తవాలను ప్రభుత్వం దాచిపెట్టకుండా వెంటనే ప్రజలకు తెలియజేయాలని అన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న విషయాలకి పెద్ద స్థాయిలో స్పందించే ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించకపోవడం ముస్లిం మైనారిటీ వర్గాలపై వివక్ష ఉన్నట్లు అర్థమవుతుందని అన్నారు.రైతు కూలీ సంఘం నాయకులు కే. నాంచార్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం కోచింగ్ సెంటర్లపై ఆధారపడుతున్నారని, కానీ అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ఆందోళనకరమని అన్నారు.పౌర హక్కుల సంఘం నాయకులు క్రాంతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని పేర్కొంటూ పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.హేతువాద సంఘం నాయకులు ఎంకే బేగ్ మాట్లాడుతూ విద్యాసంస్థలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.ఏఐటీయూసీ నాయకులు టి. ప్రభాకర్ మాట్లాడుతూ కార్మిక కుటుంబాల పిల్లల భద్రతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కోటి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల పిల్లల ప్రాణ భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రకులాల్లో ఇటువంటి ఘటనలు జరిగితే వెంటనే స్పందించే ప్రభుత్వం పేదల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటుందన్నారు.ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పి. దేవా మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ల నిఈ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు టి. రాము,వినోద్, మాచర్లరావు, ఇస్మాయిల్, సుల్తాన్, రాంబాబు, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.సమావేశం చివరగా తౌసిక్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించారు.