
రౌడీ షీటర్లకు సింగరాయకొండ సిఐ హెచ్చరిక
తొలి శుభోదయం సింగరాయకొండ:-
నేర ప్రవృత్తి కలిగి చెడు నడత కి, చెడు వ్యసనాలకు బానిసలైన వారు నడత మార్చుకుంటే సరి లేదంటే పోలీస్ చర్యలు తప్పవని సింగరాయకొండ సిఐ చావా హాజరత్తయ్య రౌడీ షీటర్లను హెచ్చరించారు. బుధవారం సింగరాయకొండ పోలీస్ సర్కిల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన రౌడీ షీటర్లు,చెడు నడత కలవారికి ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రౌడీ షీటర్లకు అవగాహన కల్పిస్తూ సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడత గల వారు, నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు,రౌడీ,కేడీ చర్యలకు పాల్పడేవారు తప్పనిసరిగా తమ ప్రవర్తన మార్చుకోవాలని హితవు చెప్పారు.క్షణిక ఆవేశం తోనో నేరాలకు పాల్పడి చెడు మార్గాన నడిచే వారు బుద్ధిగా ఉండాలని చట్ట వ్యతిరేక, నేర ప్రవృత్తి కి పాల్పడితే పోలీస్ కౌన్సిలింగ్ తప్పదని హెచ్చరించారు. నేర చరిత్ర గల వారి పై నిరంతర నిఘా ఉంటుందని ప్రతి ఒక్కరి కదలికల ను పోలీస్ లు గమనిస్తుంటారని రౌడీ షీటర్లకు గుర్తు చేశారు. పోలీస్ కి సమాచారం లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లడం కుదరదని, ఎక్కడా నేరాలకు, గొడవలకు పాల్పడ కూడదని, మహిళల పట్ల, బాలికల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని సి ఐ హెచ్చరించారు.రౌడీ షీటర్లు గా నమోదయిన వారు, నేరాల లో ముద్దాయిగా ఉన్నవారు రాజకీయ వ్యవహాలలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని,ఎన్నికల నేరాలకు దూరంగా ఉండాలని సున్నితంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర, సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, చెడు నడత గల వారిని కౌన్సిలింగ్ లో హాజరు పరిచి వారి నేర చరిత్రని వ్యక్తి గతంగా పరిశీలించారు.
