
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు కల్పించడం ఈ బందోబస్త్ ప్రధాన లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 144 అమలు చేస్తూ, అనవసర గుమికూడింపులను నివారిస్తున్నారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రతి కేంద్రం వద్ద భద్రతను మరింత బలోపేతం చేశారు.పరీక్షా సమయాల్లో విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. “విజిబుల్ పోలీసింగ్” ద్వారా పోలీసుల నిరంతర ఉనికిని చూపిస్తూ విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించబడుతూ, పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.