
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల భద్రత మరియు సామాజిక పరిశుభ్రతే లక్ష్యంగా మార్కాపురం టౌన్ పోలీసులు వినూత్నమైన బాధ్యతను చేపట్టారు. మార్కాపురం సీఐ మార్గదర్శకత్వంలో, ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలతో కలిసి పి.ఎస్. కాలనీలో అక్రమంగా మద్యం సేవించే ఓపెన్ డ్రింకింగ్ (Open Drinking) స్థలాన్ని గుర్తించి, దానిని స్వయంగా శుభ్రపరిచారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల స్థానికులకు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ ఈ తక్షణ చర్యలు తీసుకుంది.కేవలం శుభ్రం చేయడమే కాకుండా, ఇకపై అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా అవగాహన సదస్సులో పోలీసులు మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారానే నేర రహిత సమాజం సాధ్యమవుతుందని వివరించారు. పోలీసుల ఈ సామాజిక స్పందనకు మరియు చొరవకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించడమే కాకుండా, పోలీసుల పట్ల నమ్మకం మరింత పెరిగింది.