పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా, సాఫీగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని కట్టుదిట్టమైన చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మార్చి 16 నుండి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతున్న నేపథ్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఉన్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఎలాంటి సెల్ఫోన్లు, స్మార్ట్వాచీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) నిర్వహిస్తున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేస్తూ, కేంద్రాల సమీపంలో ఎవరూ గుంపులుగా గుమికూడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండకుండా పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరీక్షలు ముగిసేంతవరకు జిరాక్స్/ప్రింటింగ్ సెంటర్లు మూసివేయించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు.పరీక్షలు కొనసాగుతున్నంతసేపు మొబైల్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల సమయంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాల తరలింపు మరియు సమాధాన పత్రాలను డిపాజిట్ చేయుటకు పటిష్టమైన ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పరీక్షలు పూర్తయ్యేవరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా, సాఫీగా జరగేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.