
తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా పొన్నలూరులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా నాయకురాలు వై. సత్యవతి జండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు వినోద్ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల సాధనలో మే డే ప్రాముఖ్యతను వివరించారు. శ్రమజీవుల ఐక్యతే వారి బలమని, ప్రస్తుత కాలంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే, కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తోందని, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు రూపొందిస్తూ వారికి కొమ్ము కాస్తోందని వినోద్ విమర్శించారు. ఈ విధానాలు కార్మికుల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మధురవాణి, పోలమ్మ, సుబ్బయ్య, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కార్మికులు, మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై మే డే స్పూర్తిని ప్రతిబింబించారు.