
తొలి శుభోదయం ప్రకాశం:-
రోడ్డు ప్రమాదాలను నివారించడం, ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అద్దంకి సీఐ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఎదురయ్యే ప్రమాదాలపై వివరించారు.పోలీసులు మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం ద్వారా తల గాయాల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, తమ భద్రత కోసం ప్రతి వాహనదారుడు హెల్మెట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.