
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలో బహిరంగ మద్యం సేవన కేంద్రాల తొలగింపు మరియు శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి నేతృత్వంలో, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు గ్రామ పెద్దల సహకారంతో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఉన్న మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు తదితర చెత్తను పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధం అని, ఇటువంటి చర్యలు సామాజిక శాంతికి భంగం కలిగిస్తాయని పోలీస్ అధికారులు ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు.అదేవిధంగా గ్రామస్తులకు బహిరంగ మద్యం సేవనాన్ని నివారించాల్సిన అవసరం, కుటుంబాలు, యువతపై దాని ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. ప్రజా ప్రదేశాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి శుభ్రత మరియు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని, బహిరంగ మద్యం సేవనానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ మద్యం సేవనం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే శుభ్రమైన, సురక్షితమైన ఇనమాన మెల్లూరు గ్రామం సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.
