
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నివారణ లక్ష్యంగా డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో విస్తృత అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మహిళలపై జరిగే నేరాలు (Crime Against Women), గృహ హింస, వేధింపులు, ఈవ్టీజింగ్ వంటి ఘటనలపై చట్టపరమైన రక్షణ, పోలీస్ శాఖ అందించే సహాయ సేవలపై వివరించారు. అలాగే శక్తి యాప్ వినియోగం మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో SOS అలర్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్, డయల్ 112/100, మహిళా హెల్ప్లైన్ 181 వంటి సేవలను ఎలా వినియోగించుకోవాలో ప్రాయోగికంగా అవగాహన కల్పించారు.అదేవిధంగా సైబర్ నేరాలు – ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తలు అంశంలో OTP మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఆన్లైన్ చీటింగ్ల నుంచి ఎలా జాగ్రత్త పడాలో వివరించారు. మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్ప్రభావాలు, నివారణ చర్యలుపై మాట్లాడుతూ, డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాలను వివరించి, యువతను ఈ చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా నియమాలు అంశంలో హెల్మెట్ తప్పనిసరి వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటన, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
పోలీస్ అధికారులు మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తమ పరిసరాల్లో మహిళల భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే మహిళలకు భద్రత, నేరరహిత సమాజం, సురక్షితమైన ప్రకాశం జిల్లా సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.