
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలే ప్రధాన డిమాండ్ గా మే 6 తేదీ విజయవాడలోని ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నా విజయవంతం చేయాలని లక్ష్యంతో ఆదివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను నెల్లూరు లోని వారి నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యను కూడా పరిష్కరించలేదని, ఆ పరిస్థితుల్లో వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ దశల వారి పోరాటంలో భాగంగా మే నెల 6వ తేదీ విజయవాడలో ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం మంచి పరిణామని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో వైయస్సార్ టి ఏ ముందుండాలని వారి కోరారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేశవరపు జాలిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే పీఆర్సీ కమిటీని ప్రకటించి, ఐ ఆర్ ఇవ్వడం జరిగిందని, ఇకనైనా ఈ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ నియమించి, ఐ ఆర్ 30% ఇవ్వాలని, 4 డి ఏ లు వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధనకై రోడ్ మ్యాప్ ఇవ్వాలని, ఎయిడెడ్, మునిసిపల్, మోడల్ స్కూల్, కేజీబీవీ, 98 మరియు 2008, గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి బి. రఘురాం రెడ్డి మాట్లాడుతూ CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఆప్షన్ హాలిడేస్ ను స్కూల్ యూనిట్ గా తీసుకోవాలని, అసెస్మెంట్ బుక్స్ ను రద్దు చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర, ప్రసాద్ రెడ్డి, ప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివశంకర్ రెడ్డి, మున్నీర్ జాన్, ప్రకాశం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
