
సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫిర్యాదు
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలం మోచర్ల గ్రామసచివాలయంలో 11 మంది సిబ్బంది పనిచేస్తుండగా… శుక్రవారం ఒక్కరు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మిగతా పదిమంది ఉదయాన్నే రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లిపోయారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు… శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీకి వెళ్లడంతో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగు చూసింది. సచివాలయ ఉద్యోగులు విధులకు సక్రమంగా రావడం లేదని, తెట్టు గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన… సచివాలయానికి ఆకస్మికంగా వెళ్లారు. ఆ సమయంలో డిజిటల్ అసిస్టెంట్ ఒక్కరే ఉన్నారు. పదిమందిలో ముగ్గురు మాత్రం, గుడ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశానికి హాజరైనట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు, మిగిలిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… వారికి మెమోలు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఆ తర్వాత కలెక్టర్ రాజాబాబుకు, సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలకు సిఫార్సు చేశారు.
