
జాతీయ రహదారులపై జాగ్రత్తలు తప్పనిసరి… ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు
ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పలు వినూత్న చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా టోల్ గేట్లు, ఒంగోలు టౌన్ మరియు ఇతర ముఖ్య ప్రాంతాలలో పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.ప్రత్యేకంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, చర్చి సెంటర్, మంగమూరు రోడ్డు, టంగుటూరు టోల్ గేట్తో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ పరిధుల్లో పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ వినియోగించి వాహనదారులకు సూచనలు తెలియచేస్తున్నారు. ప్రజలతో మాట్లాడి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు మీద వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు డ్రైవ్ చేసే వారు సీట్ బెల్ట్ ధరించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదమని, ఇది మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. సర్వీస్ రోడ్డు నుండి జాతీయ రహదారిపై ప్రవేశించే సమయంలో తప్పనిసరిగా వాహనాన్ని ఆపి, ఇరువైపులా పరిశీలించి తర్వాత మాత్రమే ముందుకు సాగాలని సూచించారు. నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి వాహనదారుడు ఎడమ వైపునే ప్రయాణిస్తూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని, అలాంటి పరిస్థితుల్లో జరిగే ప్రమాదాలు కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తాయన్నారు. నేషనల్ హైవేపై నిర్దేశించిన ప్రదేశాలలోనే వాహనాలను పార్క్ చేయాలని, ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని, నిదానంగా, ప్రశాంతంగా ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెరిగినప్పుడే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామన్నారు.