
వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ
రైతుల బాధలు అధికారులు అర్థం చేసుకోవాలి
భూ సమస్యలపై ఎక్కువ దృష్టిపెట్టాలని ఆదేశం
తొలి శుభోదయం కందుకూరు:-
వలేటివారిపాలెం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం ప్రజాదర్బార్ నిర్వహించగా, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు ఎక్కువగా భూ సమస్యలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేశారు. వివాదాస్పదం లేని, అధికారుల తప్పిదం వల్ల జరిగిన సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు. రైతుల బాధలను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజా దర్బార్ లో వచ్చే అర్జీలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం లాగిన్ లో నమోదు చేస్తున్నట్లు చెబుతూ… ప్రతి అర్జీ పరిష్కారం అయ్యేవరకు పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా, ఆన్లైన్ లో తప్పులు, భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, కొన్నిచోట్ల భూములు 22ఏ లో నమోదు కావడం, మ్యుటేషన్లు లాంటి సమస్యలపైనే రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నెలల తరబడి అర్జీలు ఇవ్వటమే తప్ప పరిష్కారం కావడం లేదని అన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగానే తప్పులు దొర్లాయని అన్నారు. రీసెర్వెల్లో జరిగిన తప్పులను సరిదిద్దడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటివల్ల పంట రుణాలు ఇవ్వటానికి కూడా బ్యాంకులు అభ్యంతరం తెలుపుతున్నాయని, ఆ విషయాన్ని ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా పనిచేయాలని, ఈ అర్జీల పరిష్కార బాధ్యత కూడా అధికారులదేనని నాగేశ్వరరావు అన్నారు. రైతులు ఇచ్చిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించి, వారి ఆవేదనను విన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో శంకరరావు ఎమ్మార్వో నజీర్ అహ్మద్, అగ్రికల్చర్ ఏడి శేషారెడ్డి, మండల వెటర్నరీ అధికారి చెన్నకేశవులు, గ్రామ సర్పంచ్ సాధు శ్రీలత వలేటివారిపాలెం మండలం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాని ఆంజనేయులు, గుత్తా మహేశ్వరరావు, వలేటి నరసింహం, వలేటి శ్రీధర్ నాయుడు, వలేటి మధు, కొంకా రమేష్, మన్నం మాధవ, కాకుమాని మాల్యాద్రి, గుత్తా తిరుపతయ్య, తిరుపతిస్వామి, షేక్ ఖాజావలి, నవులూరి రాజా రమేష్, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, చెరువుపల్లి మాల్యాద్రి, ప్రగడ శీను కామినేని అశోక్, మోదేపల్లి నారాయణ, మన్నం కృష్ణ, అత్తోట వెంకటేశ్వర్లు, మామిళ్ళపల్లి మాధవ, మానికే కొండయ్య, మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు..
