
రూముల్లో అపరిశుభ్రం - ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
హాస్టల్ గదులు, భోజనాల పరిశీలన - ప్రిన్సిపల్ కు సూచనలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
వలేటివారిపాలెంలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, హాస్టల్ రూములు, బాత్రూములు, వంటగది, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులను అడిగి, హాస్టల్ లో వసతులు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా బాత్రూములలో నీళ్లు నిలిచి ఉండడాన్ని ఎమ్మెల్యే చూశారు. అక్కడి నుంచి వచ్చే మురుగునీరు క్లాస్ రూముల పక్కన నిల్వ ఉండడాన్ని గమనించారు. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలకు అసౌకర్యంగా ఉంటుందని, ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు. అలాగే హాస్టల్ రూమ్స్ లో పేరుకుపోయిన చెత్తను చూసిన ఎమ్మెల్యే … మరోసారి ఇలా కనిపిస్తే చర్యలు తీసుకుంటానని గట్టిగా మందలించారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా ఆయన పరిశీలించి, మెనూ తప్పక పాటించాలని సూచించారు. విద్యార్థినిలు ఇబ్బంది పడకుండా వరండాలో ఫ్లోరింగ్ ఎత్తు పెంచాలన్నారు. ఎమ్మెల్యే గారి వెంట మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, కూనిపాలెం సర్పంచ్ నవులూరి రాజారమేష్, సోమినేని మాల్యాద్రి, పరిటాల శివ తదితరులు ఉన్నారు.