
తొలి శుభోదయం న్యూస్ పెద్ద దోర్నాల:-
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నడకదారిలో దోర్నాల నుంచి శ్రీశైలం వైపు ప్రయాణించే శివభక్తుల ఆరోగ్య రక్షణ కోసం Lee Pharma మరియు ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దదోర్నాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సేవాస్పూర్తితో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ మెడికల్ క్యాంపు రెండో రోజు సందర్భంగా మార్కాపురం సబ్ కలెక్టర్ ఎం. శివరామిరెడ్డి, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ దాసరి బాలయ్య క్యాంపును సందర్శించారు. భక్తులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించిన వారు, ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. శివభక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం ముందుండి సేవలందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. రెండో రోజు మెడికల్ క్యాంపులో భాగంగా మార్కాపురానికి చెందిన ప్రముఖ వైయస్సార్సీపి కౌన్సిలర్ వైద్యులు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, కందుల ఓబుల్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొని భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేశారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే శివభక్తుల సేవే పరమోన్నతమైన సేవ అని తెలిపారు. భక్తులు ప్రయాణంలో ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండేందుకు ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు, ఉచిత మందులు అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాజ సేవకు ట్రస్ట్ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు…..