
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా లాడ్జీలలో విస్తృత తనిఖీలు నిర్వహించింది.ఈ తనిఖీలలో భాగంగా జిల్లాలోని వివిధ పట్టణాలు మరియు మండలాల పరిధిలో ఉన్న లాడ్జీలను పోలీసులు ఆకస్మికంగా పరిశీలించారు. లాడ్జీలలో బస చేస్తున్న అతిథుల వివరాలు, గుర్తింపు పత్రాలు, ప్రవేశ–నిష్క్రమణ రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను పోలీసులు సవివరంగా తనిఖీ చేశారు.అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న లాడ్జీలను గుర్తించారు. లాడ్జీ నిర్వాహకులు తప్పనిసరిగా ప్రతి అతిథి పూర్తి వివరాలను నమోదు చేయాలని, సరైన గుర్తింపు పత్రాలు లేకుండా గదులు కేటాయించకూడదని స్పష్టమైన సూచనలు చేశారు.లాడ్జీలలో ఎటువంటి అక్రమ లేదా అనుమానాస్పద కార్యకలాపాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, పోలీస్ శాఖకు పూర్తిస్థాయి సహకారం అందించాలని నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన లాడ్జీలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పని చేస్తుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.