
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన మహానుభావుడు, బహుభాషా కోవిదుడు పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మరియు పోలీస్ అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 1914 మార్చి 28న అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించినట్లు, చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం, వ్యాకరణం, ఛందస్సు, భరతనాట్యం వంటి విభిన్న విద్యలను అభ్యసించిన మహానుభావుడన్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనలో త్రివేణి సంగమంలా మిళితమై ఉన్నాయని కొనియాడారు. తెలుగు భాషా అభివృద్ధికి చేసిన కృషి అమోఘమని, ఆయన రచనలు సాహిత్యానికి విలువైన సంపదగా నిలిచాయని, ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు అని కొనియాడుతూ, ఆయన పధ్నాలుగు సంవత్సరాల వయసులోనే ‘పెనుగొండ లక్ష్మి అనే గేయ కావ్యం రచించారని, ఈ కావ్యం విద్వాన్ పరీక్షకు సైతం ప్రభుత్వం వారిచే పాఠ్యగ్రంథంగా ఎన్నిక కాబడటం విశేషమన్నారు. ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐ సీతారామిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.