
శ్రీ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి: జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
విద్య ద్వారానే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని ముందుగానే గుర్తించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని జిల్లా ఎస్పీ గారు అన్నారు. శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా శనివారం ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, పోలీస్ అధికారులు కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీ జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్తగా, సామాజిక తత్వవేత్తగా, మహిళా అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన ఆదర్శప్రాయుడని కొనియాడారు. సతీసహగమనం, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి, కుల వ్యవస్థ నిర్మూలనకు పాటు పడ్డారన్నారు. బాలికలు, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టారని, వితంతువుల పట్ల వివక్షను ఖండించారని, బడుగు, బలహీన వర్గాలు ఆర్ధికంగా,సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి కోసం, మానవ హక్కుల కోసం పోరాడిన మహోన్నత ఉద్యమకారుడన్నారు. జ్యోతిరావు పూలే గారు బాలికల విద్య కోసం మొట్టమొద్దటి పూనాలో పాఠశాలను ప్రారంభించారు. ఆయన స్ఫూర్తితోనే ఎంతోమంది మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గుర్తుచేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1888లో “మహాత్మా” బిరుదు లభించిందని తెలిపారు. ఆయన ఆశయాలను, ఆయన తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని మనమంతా స్పూర్తిగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఆర్ఐ సీతారామిరెడ్డి, రమణ రెడ్డి, ఎఆర్ ఎస్సై సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.