
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు బృందం ముమ్మర తనిఖీలు నిర్వహించారు.సంతమాగులూరు గ్రామ పరిసరాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ రైడ్లో అక్రమంగా జూదం ఆడుతున్న 11 మంది నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5,400 నగదును మరియు జూదానికి ఉపయోగించిన ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జూదం, బెట్టింగ్లు వంటి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పట్టుబడిన వారిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.గ్రామాల్లో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని అధికారులు కోరారు. ప్రజల సహకారంతోనే నేరరహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని వారు ఆకాంక్షించారు.