
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్డినులు 32 మంది మరియు వారికి రక్షణగా ఇద్దరు ఉపాధ్యాయులు శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన శాసన సభ కార్యక్రమ ప్రత్యక్ష వీక్షణ కై వెలగపూడి లోని సచివాలయ సందర్శన యాత్రకు బయలుదేరీ వెళ్లారు. వారు అక్కడ శాసనసభ కార్యక్రమాలను వారికి కేటాయించిన సమయంలో వీక్షించారు. శాసనసభ జరిగే విధానాన్ని పరిశీలించారు. వీరు పరిశీలించే సమయంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉన్నది. ఆ చర్చ విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉన్నది. ఆ సమయంలో సభ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది శాసనసభ కార్యక్రమాలపై విద్యార్థులకు అపారమైన గౌరవాన్ని కలిగించింది. ఆ కార్యక్రమం తదుపరి కొండపి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డోలా బాల శ్రీ వీరాంజనేయ స్వామి విద్యార్థినులను కలిసి వారితో సంభాషించారు. శాసనసభను సందర్శించి కార్యక్రమాలను వీక్షించడంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.భావి భారత పౌరులైన విద్యార్థినులు శాసనసభ కార్యక్రమాల విధానాన్ని ఆకళింపు చేసుకోవడం కోసం తద్వారా మంచి పౌరులుగా తయారు కావడం కోసం గాను గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో పాఠశాల విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో శుక్రవారం కొండపి నియోజకవర్గం కు సంబంధించిన సింగరాయకొండ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు పాల్గొనడం, శాసనసభ కార్యక్రమాలపై అవగాహన పొందడం అభినందనీయమని ప్రశంసించారు.తర్వాత విద్యార్థినులతో కలిసి ఛాయాచిత్రాలను దిగారు.
వీరితో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు , చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య , ఉదయగిరి శాసనసభ్యులు కే సురేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవం ముఖ్యమంత్రివర్యులు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులకు… విద్యార్థినులను అమరావతికి పంపడానికి సహకరించిన జిల్లా విద్యాశాఖ అధికారిణి సివి రేణుక మేడం కి మరియు ఇతర జిల్లా మరియు మండల అధికార ప్రముఖులకు అందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయిని కే మహాలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు.