
సోషల్ మీడియాలో తెలిసిన వ్యక్తుల నుండి డబ్బులు “అత్యవసరం” అంటూ డబ్బులు అడిగితే వెంటనే స్పందించకండి—ముందుగా ఫోన్ చేసి నిర్ధారించుకోండి.
సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ల ప్రొఫైల్ను లాక్ చేసి ఉంచడం మరింత భద్రతకు మంచిది: జిల్లా ఎస్పీ.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కొత్త రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, కొందరు సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లకు నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ గారు తెలిపారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారు ముందుగా ఫేస్బుక్లోకి ప్రవేశించి, ప్రైవసీ సెట్టింగ్స్ లేని ఖాతాల వివరాలను సేకరించి, ఆ వ్యక్తుల పోస్టులు మరియు గుర్తింపు పరిశీలిస్తారు. అనంతరం ఆ ఖాతాల్లో ఉన్న ఫోటోలను డౌన్లోడ్ చేసి, వాటిని ప్రొఫైల్ ఫోటోలుగా ఉపయోగించి నకిలీ ఖాతాలు సృష్టిస్తారు. తర్వాత ఆ నకిలీ ఖాతాల ద్వారా ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారికే మళ్లీ ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతారు. దీనివల్ల, ఎదుటి వారు అదే వ్యక్తి మరో ఖాతా తెరిచారని భావించి ఆ రిక్వెస్టులను అంగీకరిస్తున్నారని ఎస్పీ తెలిపారు.తర్వాత ఆ నకిలీ ఖాతాలను వినియోగిస్తూ కొన్నాళ్లు కొత్త ఫ్రెండ్స్తో చాటింగ్ చేసి, అనంతరం వివిధ కారణాలు చెబుతూ తమకు అత్యవసరంగా కొంత డబ్బు కావాలని, కొన్ని గంటల్లోనే తిరిగి ఇస్తామని చెప్పి తెలిసిన వారిని ఆన్లైన్ చెల్లింపు యాప్లకు డబ్బులు పంపాలని కోరుతున్నారని తెలిపారు. ఆ సందేశాలను నమ్మి నిజంగా అవసరమై డబ్బులు అడుగుతున్నారనే భావనతో వారు చెప్పిన ఆన్లైన్ చెల్లింపు యాప్లకు డబ్బులు పంపితే, వాటిని సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారని, కాబట్టి ఫేక్ ప్రొఫైల్ మోసాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు.ఫేసుబుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ ల ద్వారా డబ్బులు అడిగితే సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి నిర్దారించుకోవాలి లేదా పోలీసులకు సమాచారం అందించాలి లేదా హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చెయ్యాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు.