
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు మరింత పటిష్టం చేయడం, నేరాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్టు కింద ఆధునిక సాంకేతికతతో డ్రోన్ సర్వైలెన్స్ను విస్తృతంగా అమలు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా, కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలో ప్రకాశం జిల్లా పోలీసులు డ్రోన్ నిఘా నిర్వహించారు. ఈ డ్రోన్ పర్యవేక్షణ ద్వారా రహదారులపై ట్రాఫిక్ నియంత్రణను పటిష్టం చేయడంతో పాటు, కోడి పందేలు, జూదం తదితర అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.విస్తారమైన గ్రామీణ మరియు రహదారి ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తూ, అక్రమ కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. డ్రోన్ ద్వారా లభించిన సమాచారం ఆధారంగా ఫీల్డ్లో ఉన్న పోలీస్ సిబ్బందికి తక్షణ సూచనలు అందిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్టు ద్వారా జిల్లావ్యాప్తంగా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, నేరాలను ముందే గుర్తించి నివారించడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.ప్రజలు ఎటువంటి అక్రమ కార్యకలాపాలు లేదా అనుమానాస్పద విషయాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలతో కలిసి – ప్రజల కోసం శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.