
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,గ్రామ తిరునాళ్ల సందర్భంగా భారీగా భక్తులు, ప్రజలు తరలివచ్చే నేపథ్యంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడానికి ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ వినియోగంతో దేకనకొండ గ్రామంలో విస్తృత స్థాయిలో డ్రోన్ నిఘా నిర్వహించింది.తిరునాళ్ల వేడుకల సందర్భంగా జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలు, ఊరేగింపు మార్గాలు, దేవాలయ పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలు మరియు గ్రామ శివారులను డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ ద్వారా సాంకేతిక ఆధారిత నిఘా వ్యవస్థను వినియోగించి పై నుంచి మొత్తం ప్రాంతాన్ని సమగ్రంగా పరిశీలించడం వల్ల పరిస్థితులను తక్షణమే అంచనా వేసి అవసరమైన చోట పోలీసు బలగాలను మోహరించే అవకాశం లభించింది. డ్రోన్ ఫీడ్ ఆధారంగా బందోబస్తు సిబ్బందికి మార్గదర్శకాలు అందించి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.గ్రామ తిరునాళ్లు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడానికి పోలీస్ శాఖ అన్ని విధాలా కృషి చేసిందని, ప్రజలు కూడా పోలీసులకు సంపూర్ణ సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
