
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల ప్రాణ భద్రతే పరమావధిగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో హెల్మెట్ ధరించడం కీలకమని భావించిన పోలీస్ అధికారులు, వాహనదారులకు క్షేత్రస్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ద్విచక్ర వాహన ప్రమాదాల్లో జరిగే మరణాల్లో అత్యధికం తలకు గాయాలవ్వడం వల్లే సంభవిస్తున్నాయని, నాణ్యమైన హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని వివరించారు. కేవలం జరిమానాల కోసం కాకుండా, తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి వాహనదారుడు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. మద్యం సేవించి వాహనం నడపరాదని (Drink & Drive), మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. రోడ్డు భద్రత అనేది ఒక సామాజిక బాధ్యత అని, ప్రజల సహకారంతోనే ప్రమాద రహిత జిల్లాల స్థాపన సాధ్యమవుతుందని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.