
విద్యార్థులకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు
తొలి శుభోదయం న్యూస్ అమరావతి:-
గురువారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,538 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,115 మంది విద్యార్థులు పాసయ్యారు, 89.49 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విద్యార్థులను అభినందించారు. గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ…ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంబేద్కర్ గురుకులం విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. విద్యార్థులు, సిబ్బందికి అభినందనలు. మంత్రి లోకేశ్ విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. లోకేశ్ తీసుకొచ్చిన నూతన విద్యా విధానాలతోనే 10 వ తరగతిలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో పేద విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. పేద పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్న సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పంతో నీట్, ఐఐటీ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుంచి 10కి పెంచాం. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎంత ఖర్చు అయినా మా ప్రభుత్వం భరిస్తుంది. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.