google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 పునఃపరీక్షను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ తెలిపారు.ఈ పరీక్షకు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,821 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది.ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సీఐ, ఒక ఎస్ఐను నియమించడంతో పాటు, మొత్తం 100 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రులు, బంధువులు గుమికూడకుండా సహకరించాలని కోరిన ఎస్పీ, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా, పరీక్ష నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.విద్యార్థులు హాల్టికెట్లలో పేర్కొన్న సూచనలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఒంగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా చిన్న సంఘటన జరిగినా వెంటనే డయల్-100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
