google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
సంపూర్ణ ఆరోగ్యానికి నిత్య యోగా సాధన ఉత్తమ మార్గమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఉదయం 6 గంటల నుంచి 6.45 గంటల వరకు జరిగిన యోగా సాధన కార్యక్రమంలో సుమారు 2 వేల మంది మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 3.63 లక్షల మందికి పైగా ప్రజలు యోగాంధ్రకు నమోదు చేసుకున్నారని, గత 15 రోజులుగా 4,428 వేదికల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని, దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే యోగా అలవాటు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా యోగా శిక్షకులను సత్కరించడంతో పాటు, ఈ నెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నషా ముక్త్ భారత్’ పోస్టర్లను ఆవిష్కరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మాధురి, జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్, యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ భీమ్ నాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.