google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి ఆదేశాల మేరకు, కంభం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వాసవి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) పురస్కరించుకుని కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందితో కలిసి విద్యార్థి, విద్యార్థినులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మరియు సమాజపరంగా కలిగే తీవ్రమైన దుష్పరిణామాల గురించి సవివరంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి దశలో మాదక ద్రవ్యాల బారిన పడటం వల్ల విద్యాభ్యాసం దెబ్బతినడం, శారీరక మరియు మానసిక ఆరోగ్యం క్షీణించడం, భవిష్యత్తు అవకాశాలు కోల్పోవడం, కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతినడం వంటి అనేక ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించబడింది.
అదేవిధంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని, తాము మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటమే కాకుండా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సమాజంలోని ఇతరులకు కూడా అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించడం జరిగింది. అనుమానాస్పద మాదక ద్రవ్యాల కార్యకలాపాలు కనిపించినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలియజేయబడింది.
అలాగే, మాదక ద్రవ్యాల తయారీ, నిల్వ, రవాణా, విక్రయం, కొనుగోలు, వినియోగం వంటి నేరాలపై NDPS Act, 1985 (Narcotic Drugs and Psychotropic Substances Act) ప్రకారం అమలులో ఉన్న కఠినమైన శిక్షలు, చట్టపరమైన చర్యలు మరియు వాటి వల్ల కలిగే శాశ్వత పరిణామాల గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించడం జరిగింది. ఒకసారి డ్రగ్స్ వ్యసనానికి లోనైతే వ్యక్తి జీవితమే కాకుండా కుటుంబం మరియు సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని తెలియజేశారు.
చివరగా, ప్రతి విద్యార్థి మాదక ద్రవ్యాలకు "నో" చెప్పాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచిస్తూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.