google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. గురువారం ఒంగోలు (పేర్నమిట్ట) పొగాకు వేలం కేంద్రంలో వేలం ప్రక్రియను మంత్రి స్వయంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…. వేలంలో 'నో బిడ్' (No Bid) సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులందరూ చురుగ్గా వేలంలో పాల్గొని రైతులకు న్యాయం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, పొగాకు పండించే రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వేలం కేంద్రాలలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వ్యాపారులు అందరూ వేలంలో చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపారులతో సమన్వయం చేసుకుని రైతుల పొగాకును కొనుగోలు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పొగాకు రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మేము వేలం కేంద్రాలను పరిశీలిస్తూ రైతులకు అండగా ఉంటున్నాం. ప్రభుత్వ కఠిన నిబంధనల వల్ల గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి చాలా మెరుగైంది. అయితే ఇది ఇంకా మెరుగవ్వాల్సి ఉంది" అని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గత ఏడాది బర్లీ పొగాకు అమ్ముడుపోక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి గుర్తు చేశారు. ఆ సమయంలో మన ప్రభుత్వం స్పందించి, రూ. 300 కోట్లు కేటాయించి ఆ పొగాకును కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత సీజన్లోనూ ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం శ్రమిస్తుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.