
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా కందుకూరులో ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి డోలా శ్రీ వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత 5 ఏళ్ళు జగన్ తన విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సమర్థ నాయకత్వంతో సంపద సృష్టిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం. మెగా డిఎస్సితో 16 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసాం. తొమ్మిది నెలల తర్వాత వైసీపీ నిద్రలేచి డీఎస్సీలో అక్రమాలంటూ అసత్య ప్రచారాలు చేస్తోంది. యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ద్వేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. జగన్ రాజధానిపై పిచ్చోడి మాదిరి పూటకొక మాట మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు మూడు రాజధానులన్నారు, నేడు మావిగన్ అంటున్నాడు. అమరావతి రాజధానిగా పార్లమెంటు ఆమోదించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ సైతం ఇచ్చింది. ఇప్పుడు మావిగన్ అంటూ మాట్లాడటం ఎవరిని మభ్య పెట్టడానికి ? రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి కొనసాగాలంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు సుదీర్ఘకాలం ఆశీర్వదించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.