
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రామాయ పట్నం పోర్టు ప్రజల కోసమా?, కార్పొరేట్ల కోసమా అని సిపిఎం జిల్లా దర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం కందుకూరు సుందరయ్య భవన్ లో సిపిఎం ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో జీ.వీ కొండారెడ్డి మాట్లాడుతూ రామాయ పట్నం పోర్టు ప్రభుత్వ రంగంలో నిర్మిస్తామని చెప్పి భూ సేకరణ చేశారు. ప్రజా ప్రయోజనాలకు, కందుకూరు ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశతో భూములను ఇవ్వడం జరిగింది. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, మొదటి దశ పూర్తి కావస్తున్న దశలో రాష్ట్ర ప్రభుత్వం, దీనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనుకోవడం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వ ఆధీనంలో పోర్టు ఉంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రైవేటు వ్యక్తులకు, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే కందుకూరు ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిగే పరిస్థితులు ఉండవని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా నిర్మాణం జరుగుతుంటేనే, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలి పనులు కూడా ఇవ్వని పరిస్థితి ఉందంటే,రేపు ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకం ఎక్కడ ఉంది అన్నారు. అందుకే రామాయపట్నం పోర్టును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బులు లేవని సాకుగా ప్రభుత్వం చెప్తుంది. నిర్మాణం పూర్తి అవుతున్న దశలో, బహుళ జాతి కంపెనీలకు పోర్టును అప్పగించి, అందులో 12 శాతం ప్రభుత్వ వాటాగా తీసుకుంటే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. లక్షల కోట్ల రూపాయలు సొంతం అవుతుంది. ఇప్పటికే రామాయపట్నం పోర్టు ఆధారంగా బిపిసిఎల్, ఇండోసోల్ కంపెనీల తోపాటు జిందాల్ వంటి కంపెనీలు ఏర్పాటుకు సిద్ధమయ్యాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున కందుకూరు ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న తరుణంలో రామాయపట్నం పోర్టు కార్పొరేట్లకు ఇవ్వాలనుకోవడం ప్రభుత్వ అవివేక చర్యగా సిపిఎం పేర్కొన్నది. పోర్టును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలనే అభిప్రాయంతో ప్రజలను సమీకరించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని కొండారెడ్డి చెప్పారు. కలసి వచ్చే వారందరినీ కలుపుకొని, రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పారు. రామాయపట్నం పోర్టు అభివృద్ధి గురించి అఖిలపక్ష సమావేశం ప్రభుత్వం నిర్వహించాలని, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వాన్ని కి సూచించారు. రామాయపట్నం పోర్టు విషయాన్ని రాజకీయ వాద ప్రతి వాదాలకు కాకుండా, కందుకూరు ప్రాంత అభివృద్ధికి సింబాలిక్ గా చూడాలని ఆయన సూచించారు.రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండో సోల్ కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు యివ్వాలి రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే ఆ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం ఆధీనంలోనే పోర్టు నిర్మిస్తామని చెప్పటంతో,ఈ ప్రాంత నిరుద్యోగులు, ప్రజలు తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశించారు. ఇప్పటివరకు కేవలం 5 శాతం మాత్రమే ఉద్యోగాలు రామాయపట్నం పోర్టు, బిపిసిఎల్, ఇండోసోల్ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ జరిగితే కందుకూరు ప్రాంత నిరుద్యోగులకు, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితి ఉండదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మూడు కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం కందుకూరు నియోజకవర్గ నాయకులు జి వెంకటేశ్వర్లు, ఎస్ ఎ గౌస్, జీవీబీ కుమార్ లు పాల్గొన్నారు