
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ పి. బాలమురళీకృష్ణ పరివేక్షణలో
దర్శి సర్కిల్ పోలీసులు పాత పెండింగ్ దొంగతనం కేసులను ఛేదించే క్రమంలో మరో కేసును ఛేదించి, మహిళా నిందితురాలిని అరెస్టు చేసి సుమారు 128 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డీఎస్పీ పి. బాలమురళీకృష్ణ తెలిపారు.
బాధితురాలు: చెన్నంశెట్టి సుమలత, పుట్ట బజారు దర్శి టౌన్.
గత సంవత్సరం 03-10-2025 తేదీన దర్శికి చెందిన చెన్నంశెట్టి సుమలత అనే ఆమె తన పుట్టింటి నుండి త్రిపురాంతకం మీదుగా బస్సులో దర్శికి తన అత్తగారింటికి వస్తున్న సమయంలో తనతో పాటు తన కుమార్తె మరియు లగేజీ బ్యాగులను తీసుకువచ్చింది. బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ పర్సును బట్టల బ్యాగులో ఉంచుకొని ప్రయాణించింది. దర్శిలో బస్సు దిగి ఇంటికి వెళ్లిన అనంతరం బ్యాగును పరిశీలించగా అందులో ఉండవలసిన హ్యాండ్ పర్సు కనిపించలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు తన బంగారు ఆభరణాలు ఉన్న పర్సును అపహరించినట్లు దర్శి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయబడింది. తదుపరి ఈ కేసు దర్యాప్తును దర్శి సీఐ వై. రామారావు చేపట్టి, ఈరోజు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అద్దంకి రోడ్డులోని సంస్కృతి స్కూల్ సమీపంలో సాతుపాటి కుమారి భర్త బ్రహ్మయ్య, సాయి నగర్, దర్శి టౌన్ కు చెందిన మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా, తానే ఈ దొంగతనం చేసినట్లు అంగీకరించింది. ఆమె వద్ద నుండి ఈ కేసులో అపహరించబడిన మొత్తం 128 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రికవరీ చేసిన బంగారు ఆభరణాలు
బంగారు సాదా నెక్లెస్ – 17 గ్రాములు
బంగారు చైను మరియు లాకెట్ – 20 గ్రాములు
బంగారు పెద్ద చెవి కమ్మలు (1 జత) – 18 గ్రాములు
బంగారు చెంపసవరాలు – 2 జతలు - 20 గ్రాములు
బంగారు చిన్న చెవి కమ్మలు (2 జతలు) – 6 గ్రాములు
బంగారు గాజులు (3) – 47 గ్రాములు
మొత్తం బరువు: సుమారు 128 గ్రాములు.
అరెస్టు చేసిన నిందితురాలు సాతుపాటి కుమారిపై గతంలో కూడా పలు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితురాలిని గౌరవ దర్శి న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ శ్రీ పి. బాలమురళీకృష్ణ తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన సీసీఎస్ సీఐ కమలాకర్, దర్శి సీఐ వై. రామారావు, దర్శి ఎస్ఐ ఏడుకొండలు మరియు కేసు దర్యాప్తులో పాల్గొన్న ఇతర పోలీసు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు అభినందించారు.