
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ‘మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ 4.0’ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు.మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, ఆరోగ్యం, క్రమశిక్షణ, మానసిక వికాసం, క్రీడలు, స్నేహ సంబంధాలు వంటి ప్రతి అంశంపై రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించి వారితో మాట్లాడాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని, నేడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవనే పరిస్థితి రావడం విద్యారంగంలో వచ్చిన మార్పులకు నిదర్శనమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు సాగితేనే విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.అబ్దుల్ కలాం వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె పిలుపునిచ్చారు. విద్యాభివృద్ధి ద్వారా కుటుంబ, సమాజ, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మీరా సాహెబ్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.