
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఉత్తర్వుల మేరకు జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ‘స్కై ఐ ప్రకాశం (Sky Eye Prakasam)’ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం ఆడడం, పేకాట నిర్వహించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. గ్రామ శివారులు, వ్యవసాయ పొలాలు, తోటలు, ఖాళీ ప్రదేశాలు మరియు ఇతర అనుమానాస్పద ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెంటనే సమాచారం అందించే విధంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది.డ్రోన్ సాంకేతికత వినియోగంతో అక్రమ కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, శాంతిభద్రతలను కాపాడడం మరియు విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఇటువంటి ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.