
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా పార్టీ పరంగా చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఏ. పి లో అమలు జరుపుతామన్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి మహిళా లోకం తరుపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళా సబ్ కోటా సంగతి తేల్చాలంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జాడి శ్వేత కోరారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పిస్తూ ఆమేరకు డిమాండ్ చేశారు.
అనాదిగా అన్ని రంగాలలో అన్ని విధాలుగా వెనకకు నెట్టబడ్డ బిసి మహిళలు, ఆధిపత్య పెత్తందారి మహిళలతో పోటీపడి ఎన్నికలలో పోటీపడి చట్టసభలలో అడుగు పెట్టడం అసాధ్యమన్నారు.
ఆనాడు యుగపురుషుడు అన్న ఎన్ టీ ఆర్ గారు మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కలిగించి దేశానికి దిక్సూచి అయినట్లే ఈనాడు చంద్రబాబు మరియు లోకేష్ చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించి భారత దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
బీసీ మహిళలకు 33 శాతం మహిళా రిజర్వేషన్లలలో 3 వ వంతు అనగా 11 శాతం ఉపకోట కేటాయించి వెనుకబడిన మహిళా సాధికారితకు తోడ్పడాలన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించి చంద్రబాబు మరియు లోకేష్ లు బీసీ ఉద్యమ చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోవాలని బీసీ సమాజం ఆకాంక్షిస్తుందని జాడీ శ్వేత అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎరగొండపాలెం బీసీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, గిద్దలూరు బీసీ అధ్యక్షులు మధు మరియు ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.