
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురం మండల పరిషత్ మోడల్ స్కూల్లో చదువుతున్న కొమ్ము లక్ష్మి తనూజ అనే బాలిక కనిపించకుండా పోయినట్లు ఆమె తండ్రి కొమ్ము మల్లికార్జున్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, బాలిక ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి, అత్యంత వేగంగా స్పందించి బాలికను గంటల్లోనే సురక్షితంగా గుర్తించారు.అనంతరం బాలికను క్షేమంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమార్తెను సురక్షితంగా గుర్తించి అప్పగించిన ఒంగోలు తాలూకా పోలీసుల వేగవంతమైన స్పందనకు కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారులు కనిపించకుండా పోయిన సంఘటనల్లో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ప్రజల భద్రత, చిన్నారుల రక్షణ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు.