
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా జరిగేలా చర్యలు చేపడుతూ, ఏటీఎంల వద్ద జరిగే చోరీలు, కార్డు స్కిమ్మింగ్, మోసాలు వంటి ఆర్థిక నేరాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లాలోని వివిధ ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏటీఎంలలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, అలారం వ్యవస్థలు, భద్రతా సిబ్బంది విధులు, లైటింగ్ సౌకర్యాలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లోపాలు గుర్తించిన చోట వాటిని వెంటనే సరిచేసేలా సంబంధిత బ్యాంకు అధికారులు, ఏటీఎం నిర్వహణ సంస్థలకు సూచనలు చేశారు.అలాగే, ఏటీఎం వినియోగదారులు తమ పిన్ నంబర్ను ఎవరితోనూ పంచుకోకూడదని, అపరిచితుల సహాయం తీసుకోకుండా స్వయంగా లావాదేవీలు నిర్వహించాలని, ఏటీఎంల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా పరికరాలు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజల ఆర్థిక భద్రతను పరిరక్షించడంలో భాగంగా ఇటువంటి తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.