
తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
కూటమి రెండేళ్ల పాలనలో రూ.1.49 లక్షల కోట్లతో ప్రజలకు సంక్షేమం, రూ.1.34 లక్షల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని రెండేళ్లలో అభివృద్ధి బాట పట్టించడం జరిగింది. విద్వేషం, విధ్వంసమే లక్ష్యంగా గత అయిదేళ్ల వైసీపీ పాలన సాగింది. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. గత అయిదేళ్లలో ఎక్కడా కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేయలేదు.. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒక్క పరిశ్రమ తేలేదు. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో 3,800 కి.మీ. మేర రోడ్లు నిర్మించాం… గుంతలు లేని రహదారులను నిర్మిస్తున్నాం. రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. రెండేళ్లలో సంక్షేమానికి రూ.1.49 లక్షల కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1.34 లక్షల కోట్లు వ్యయం చేశాం. రుణాల రీషెడ్యూల్ తో రూ.8,269 కోట్లు ఆదా చేశాం. ఉద్యోగుల బకాయిలు రూ.30,849 కోట్లు విడుదల చేశాం.
గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు రూ.19,357 కోట్లు చెల్లించాం.
వైసీపీ హయాంలో నిలిపివేసిన 86 కేంద్ర పథకాలను పునరుద్ధరించాం. పెండింగ్ లో ఉన్న రూ.8,695 కోట్లు జమ చేసి రాష్ట్రానికి రూ.45,138 కోట్ల మేర నిధులు తెచ్చాం. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమర్థ నాయకత్వం, పరిపాలన దక్షతతో రాష్ట్రంలోని అన్నింటినీ గాడిలో పెట్టడం జరిగింది. అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నారు. సంక్షేమం కోసం రూ.1.49 లక్షల కోట్లు
ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం-2.0, ఎన్టీఆర్ వైద్యసేవ వంటి పథకాల ద్వారా ప్రతి వర్గానికీ మేలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాం. SC సంక్షేమానికి రూ.19,100కోట్లు ఖర్చు చేసి 43 లక్షల మంది లబ్దిదారులకు మేలు చేశాం. ST సంక్షేమానికి రూ.5,730 కోట్లు ఖర్చు చేసి 9 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం కల్పించాం. BC సంక్షేమానికి రూ.32,534కోట్లు ఖర్చు చేసి 1.18 కోట్ల మంది లబ్దిదారులకు మేలు చేశాం, మైనారిటీ
వెల్ఫేర్కు రూ.4,856 కోట్లు ఖర్చు చేసి 17 లక్షలకు పైగా లబ్దిదారులకు ప్రయోజనం కల్పించామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.